రచన : అవైజ్
కథ వినిపించినవారు రమ్య గీతిక
ఈ కథని ఇక్కడ వినండి ===> దయ్యం!

మున్నావాళ్ళిల్లు ఓ కొండ పై ఉంది. ఆ ఇంటి వెనక చిట్టడవి ఉంది. బయట తిరక్కుండా ఇంట్లోనే ఆడుకోవాలని మున్నా వాళ్ళ అమ్మా నాన్నా చెప్పారు.
కానీ మున్నాకి ఆ అడవిలో ఏముందో చుడాలని కోరిక. తను చదివే కథల్లో వున్నట్టు ఆ అడవిలో జంతువులు ఉంటాయి, అవి మాట్లాడతాయి. తనతో స్నేహం చేస్తాయి. అనుకునే వాడు.
ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాడు. అడవిలో దయ్యం వుంది. అది మనుషులని తినేస్తుంది. అని చెప్పింది వాళ్ళ అమ్మ. మున్నాకి భయం వేసింది. ఐనా కుడా అమ్మ వూరికే అలా అంటుంది లెమ్మని అనుకున్నాడు.
ఓ రోజు మున్నా ఇంట్లో ఎవరికీ తెలియకుండా అడవిలోకి వెళ్ళాడు.
కాస్త దూరం వెళ్ళే సరికి దూరంగా ఏదో నల్లటి ఆకారం అటు ఇటూ కదులుతూ కనిపించింది. ‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో. కాస్త ధైర్యం తెచ్చుకుని దగ్గరకి వెళ్ళి పరీక్షించాడు. గాలికి ఊగే ఒక చెట్టు నీడ అది.
‘హమ్మయ్య ఇది దయ్యం కాదు’ అనుకున్నాడు.
కాసేపటికి వెనకగా ఎవరో వస్తున్నట్టు ఎండుటాకుల శబ్దం వినిపించసాగింది. ‘అది దయ్యం కావచ్చు’ అనుకున్నాడు భయంతో. ఓ చెట్టు చాటుకి వెళ్ళి వచ్చేది ఎవరా అని చూడసాగాడు.
తీరా ఆ వచ్చింది ‘చోటు’. చోటు వాడి కుక్కపిల్ల. మున్నాని వదిలి ఉండలేదు కదా! అందుకే వెతుక్కుంటూ వచ్చేసింది.
‘అబ్బా.., భయపడి చచ్చాను. చోటూ గాడా’ అనుకున్నాడు.
ఇద్దరూ కలిసి ముందుకు నడవసాగారు. వాళ్ళకి, దూరంగా ఓ ఎండిపోయిన చెట్టు, దానిపై దయ్యం కనిపించింది. చోటుగాడు భయంతో మున్నా వెనుక నక్కి కూర్చున్నాడు. ‘తను భయపడితే చొటూ ఇంకా భయపడతాడు’. అనుకున్నాడు మున్నా.
నిజానికి ఆ ఎండిపోయిన చెట్టు కొమ్మలు దూరానికి దయ్యం ఆకారంలా కానిపిస్తున్నాయి.
ఆ విషయం తెలియని మున్నా చోటు ని ఎత్తుకుని గబ గబా వెనిక్కి తిరిగి ఇంటిదారి పట్టాడు.
ఇంటికి వచ్చాక తన స్నేహితులతో తాను అడవిలో దయ్యం చుశానని చెప్పడం మొదలు పెట్టాడు.
** ** **
రచన: అవైజ్ ( తిరుపతి)